కాంగ్రెస్ కళేబరాన్ని ఈడ్చిపారేద్దాం

కాంగ్రెస్ కళేబరాన్ని ఈడ్చిపారేద్దాం ------భారతీయరాష్ట్రసమితికి బాసటగా నిలుద్దాం. ---------------జై బాపూ కెసిఆర్ తెలంగాణను నెత్తుటిముద్దగా మార్చిన కాంగ్రెస్ పార్టీ పీడ వదిలి తొమ్మిదన్నరేళ్ళు అయింది. గాయాలను మాన్పుకుంటూ,శక్తిని కూడదీసుకుంటూ తెలంగాణతల్లి ఊపిరి తీసుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ భూతం గ్యారంటీలపేరుతో మళ్ళీ మనముందుకొస్తుంది. తెలంగాణ తల్లి గొంతునులుమడానికి తహతహలాడుతుంది....... కంట్లో వత్తులేసుకొని తెలంగాణ తల్లికి కాపలాకాస్తున్న బాపు కేసిఆర్ ను అడ్డు తొలగించుకోవడానికి అడ్డమైనపనులకు పూనుకుంటుంది. తెలంగాణ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే కాంగ్రెస్ దుర్మార్గం కళ్ళముందు మెదులుతుంది. ఆ దృశ్యాలు మనలను ఒక పట్టానవదిలిపెట్టవు,నీడలా వెంటాడి భయపెడతాయి. ఆపరేషన్ పోలోనుండి ప్రారంభమైన కాంగ్రెస్ రక్తచరిత్ర బాపు కేసిఆర్ వచ్చేదాకా అప్రతిహతంగా కొనసాగింది. నిజాం విముక్తి పేరుమీద తెలంగాణ ప్రజలపై దమనకాండ కొనసాగించింది............ నిజాంకు,నిజాంనవాబు అండతో గ్రామాల్లో దొరలు,దేశ్ ముఖ్ లు సాగిస్తున్న దోపిడి,పీడనలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. ప్రజలు పోరాడి సాధించుకున్న పదిలక్షల ఎకరాల భూమిని తిరిగి దొరలకు అప్పగించింది. సంఘందెబ్బకు భయపడి పారిపోయిన దొరలు ఖద్దరు టోపీలు దరించి తిరిగి గ్రామాలకు వచ్చారు. లక్షలాదిమంది ప్రజలను,ప్రజాయోధులను ఊచకోతకోసి దోపిడివర్గాలకు అండగా నిలిచింది. సుందర్ లాల్ కమీషన్ ను తొక్కిపెట్టారు. దాన్ని బహిర్గతం చేస్తే తాము చేసిన దుర్మార్గాలు భయటపడుతాయని కాంగ్రెస్ భయం............ తెలంగాణ ట్వెల్వ్ గా ప్రసిద్దిచెందిన పన్నెండుమంది తెలంగాణ యోధులకు ఉరిశిక్ష విధించింది కాంగ్రెస్ మిలిట్రీ ప్రభుత్వమేనన్న సంగతి మనం మరచిపోరాదు. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ పోలో చేపట్టింది నిజంగా నైజాంనుండి తెలంగాణను విముక్తి చేయడానికి కాదు. నైజాంకు,నైజాంకు అండగా ఉండే దొరలకు రక్షణ కల్పించడానికేనన్న విషయం మనకు ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి............... కాంగ్రెస్ ప్రభుత్వం నైజాం ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించింది. సంవత్సరానికి యాభైలక్షల రూపాయల భరణం చెల్లించింది. నైజాం నవాబును రాజ్ ప్రముఖ్ గా నియమించి, చాలాకాలం అతడిపేరుమీదనే పాలన సాగించింది. తెలంగాణ ప్రజలపట్ల కాంగ్రెస్ కుండే చిత్తశుద్ది ఇదే. ఆంధ్ర లాబియింగ్ కు లొంగి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా ఆంధ్రలో విలీనంచేసి తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టింది కాంగ్రెస్ పార్టే. మన తెలంగాణ వనరులన్నింటిని కొల్లగొట్టింది కాంగ్రెస్ పార్టే. వలసదోపిడికి,అణచివేతకు వ్యతిరేకంగా 1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నెత్తుటేరుల్లో ముంచెత్తింది. 370 మంది విద్యార్థి యోధులను పొట్టనపెట్టుకుంది. బాపు కేసిఆర్ నాయకత్వంలో మొదలైన మలిదశ ఉద్యమాన్ని గుర్తించకుండా తాత్సారంచేసి పన్నెండువందలమందిని బలితీసుకుంది. వచ్చిన తెలంగాణను కూలగొట్టడానికి ప్రయత్నించిన ఒక నయవంచకుడికి పిసిసి పీఠం అప్పజెప్పి తెలంగాణ ప్రజల మనోభావాలను చావుదెబ్బతీసింది.................. కాలంచెల్లిన కాంగ్రెస్ చెప్పే గ్యారంటీలకు విలువ ఉండదు. మన కల్వకుంట్ల రామన్న చెప్పినట్టు వారంటీలేని కాంగ్రెసు గ్యారంటీలు అమలుకావు. తెలంగాణలో దుర్గంధం వెదజల్లుతున్న కాంగ్రెస్ మృతకళేబరాన్ని ఈడ్చిపారేద్దాం. మనలను కన్నబిడ్డల్లా చూసుకునే బాపు కేసిఆర్ కి బాసటగా నిలుద్దాం. Sridevimantri

Comments

Popular posts from this blog

పాలకుల కుట్రలపై త్యాగాల విజయం ..సిరికొండ మధుసూదనాచారి

సుందర సత్సంగము

కలికి కళ్ళెం వేయండి