త్యాగాల నిచ్చెన వేసి.. బీఆర్ఎస్@25 ఏండ్లు

పాదయాత్రలతో నీళ్లల్లో నిప్పులు మండించి, ధర్నాలతో తెలంగాణలో ధైర్యం వెలిగించి, బహిరంగ సభలతో జన సునామీలను సృష్టించి, రాజీనామా త్యాగాలు ధారపోసి విశ్వాసా న్ని పండించి ఇలా ఎన్నోసార్లు సీతమ్మ తల్లిలా అగ్గిలో దూకి ప్రత్యేక రాష్ట్ర పోరాట ప్రాతివత్యాన్ని కాపాడి, దేశం కళ్లు తెరిపించాడు కేసీఆర్. చివరికి ఆమరణ దీక్షతో ప్రాణత్యాగానికీ సిద్ధపడి నలుదిక్కులా నిప్పుల వర్షం కురిసేలా చేసి, తెలంగాణ ఆవిర్భావానికి మార్గం సుగమం చేశాడు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఎనిమిదేండ్లలోనే అనేక అవాంతరాలను అధిగమించి తెలంగాణను విఫల రాష్ట్రం కాకుండా సర్వశక్తులు ఒడ్డి తాను శ్రమించడమే కాకుండా అన్ని స్థాయుల వ్యవస్థలనూ పరుగులు పెట్టించారు. ఈ ప్రయాణం ఎంత భీతావహమోకదా? ఎత్తుకున్న తెలంగాణపై ఎంత ప్రేమ ఉంటే కత్తుల వంతెనపై నడువగలరు? టీఆర్ఎస్ తొలినాళ్లలో ఒకసారి ఓయూ క్యాంపస్ నుంచి కొంతమంది మిత్రులం నిర్మాణంలో ఉన్న నందినగర్ ఇంట్లో కేసీఆర్తో సమావేశమైన సందర్భంగా ఒక విద్యార్థి మిత్రుడు ఇదంతా సాధ్యమా సార్ అంటూ అనుమానపడ్డాడు. అంతే కేసీఆర్ ఆవేశంగా ఏందయ్యా.. మీరంతా యువకులు, అవసరమైతే ఆకాశానికి సైతం అగ్గిపెడతమనే ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ, ఇలా మాట్లాడరాదంటూ హెచ్చరించాడు. బహుశా అంతకుమించిన విశ్వాసాన్ని నిరంతరం శ్వాసించబట్టే త్యాగాల నిచ్చెనేసి తెలంగాణను అస్తిత్వ శిఖరంపై కూర్చోబెట్టగలిగారు. దానివల్లనే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభపై 20 రోజుల ముందే పల్లెల్లో భావోద్వేగం ఏర్పడింది. సహజంగా రాజకీయ పార్టీల సభలు తరలింపు మళ్లింపు అన్నట్టుగా జరిగిపోతాయి. కానీ, ఒక రాజకీయ పార్టీ రజతోత్సవం చరిత్రలోనే ఇంతలా చర్చనీయాంశం కాలేదు. అద్వితీయమైన గతాన్ని చూసిన ప్రతివారూ మనసారా అందరిలో నెమరేసుకుంటేనే కదా నూతన తరానికి నిజాలు తెలిసేది? (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)

Comments

Popular posts from this blog

మంచిమాటలు

15- 9th page

17th slokam